Showing posts with label Kalingapatnam port. Show all posts
Showing posts with label Kalingapatnam port. Show all posts

Friday, April 23, 2010

Kalingapatnam port , కళింగపట్నం పోర్ట్






సహజ ఓడరేవు
సహజ ఓడరేవు అయిన కళింగపట్నం స్వతంత్య్రానికి పూర్వం దేశవిదేశాలతో ఎగుమతి దిగుమతులకు కేంద్రంగా ఉండేది. వందలాది మందికి ఉపాధి కల్పించడంతో పాటు ప్రభుత్వానికి కొంత విదేశీ మారకద్రవ్యాన్ని సమకూర్చేది. అలాంటి వైభవాన్ని కోల్పోయి నేడు దీనావస్థలో ఉంది. ప్రభుత్వాలు మారినా పరిస్థితిలో మార్పు రాలేదు.
కళింగనగరి పేరుతో..
2000 సంవత్సరాలకు పూర్వమే ఇక్కడ ఓడరేవు ఉంది. ఈ ప్రాంతాన్ని కళింగనగరి పేరుతో పిలిచేవారు. 17వ శతాబ్దంలో ఈ ప్రాంతానికి వర్తక వ్యాపారం నిమిత్తం వచ్చిన డచ్చివారు నిర్మించిన విశాలమైన భవనాలు ఇక్కడ నేటికి పటిష్టంగా ఉండడం విశేషం. 1768లో అప్పటి నిజాం నవాబులు ఈ ప్రాంతాన్ని బ్రిటీష్‌ వారికి అప్పగించినట్లు చారిత్రక పరిశోధకులు చెబుతున్నారు. అనంతరం బ్రిటీష్‌ వారు ఇక్కడ సిగ్నల్‌ స్టేషన్‌, లైట్‌ హౌస్‌, పోర్టు భవనాలు నిర్మించారు.

వ్యాపారం సాగిందిలా
రెండో ప్రపంచ యుద్ధకాలం వరకు బర్మా(మయన్మార్‌), రంగూన్‌, సింగపూర్‌, మలేషియా, తదితర దేశాలతో ఎగుమతి దిగుమతులు జరిగేవి. 1941 తర్వాత ఓడల రాకపోకలు ఇక్కడ నిలిచిపోయాయి. ఏషియా టెక్‌ షిప్పింగ్‌ కంపెనీ, బ్రిటీష్‌ ఇండియా స్టీమ్‌ నేవిగేషన్‌ కంపెనీలకు చెందిన ఓడలు తరచూ ఇక్కడకు వచ్చి వెళ్లేవి. సహజసిద్ధమైన ఓడరేవు కావడం, చక్కని వాతావరణం మెరుగైన సౌకర్యాలున్నాయి.

భవనాలు ఖాళీ
ప్రకృతి వైపరీత్యాల సమయంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లే జాలర్ల కోసం హెచ్చరికలు జారీ చేసేందుకు ఏర్పాటు అయిన భవనాలు, గోదాములు, సిగ్నలింగ్‌ వ్యవస్థ పూర్తిగా శిథిలమయ్యాయి. గత ఏడాది వీటిని రాష్ట్ర ఓడరేవుల శాఖ రూ.5 లక్షలతో పునర్నిర్మాణం చేపట్టింది. ఇక్కడున్న కన్సర్వేటర్‌ను భావనపాడుకు బదిలీ చేయడంతో ఇక్కడ కార్యకలాపాలు నిలిచిపోయాయి.

ప్రాజెక్టు నివేదికలో..
ఒరిస్సాలో పోర్టు శాఖలో అధికారిగా పనిచేసి పదవీ విరమణ చేసిన కెప్టెన్‌ కె.ఎన్‌.స్వామి దీని పురోగతికి ప్రాజెక్టు నివేదిక తయారు చేశారు. అందులో వివరాలిలా..

* ఇక్కడ మూడు మిలియన్‌ టన్నుల సామర్థ్యం గల స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తే ఇందుకు అవసరమైన ముడి సరుకు (కోల్‌)ను జింబాబ్వే, ముజాంబిక్‌, దక్షిణాఫ్రికా దేశాల నుంచి దిగుమతి చేసుకోవచ్చు. ఇక్కడ తయారైన స్టీలు విదేశాలకు ఎగుమతి చేయవచ్చు.

* రాయగడ అల్యుమినియం ప్లాంట్‌కు ముడిసరుకు తెప్పించి తయారైన వాటిని ఎగుమతి చేయడం, ఆమదాలవలస నుంచి కళింగపట్నం వరకు ప్రత్యేక రైల్వేలైన్‌ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.

భూమిని గుర్తించిన రెవెన్యూ అధికారులు
కళింగపట్నం పోర్టు అబివృద్ధి కోసం గత ఏడాది మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆదేశాల మేరకు ఆ ప్రాంతంలో రెవెన్యూ అధికారులు రెండువేల ఎకరాల భూమని గుర్తించారు. ప్రస్తుతం కళింగపట్నంలో ఉన్న పోర్టు భూములు, సాల్టు భూములతో పాటు వమరవల్లి, మత్స్యలేశం, బందరువానిపేట తదితర గ్రామాలకు చెందిన కొందరు రైతుల భూముల సర్వే జరిపారు. ఇందుకు సంబంధించి సర్వే నెంబర్లు, భూ విస్తీర్ణం, స్కెచ్‌, మ్యాపులతో కూడిన నివేదికను తహసీల్దార్‌ బలివాడ దయానిధి హైదరాబాద్‌లో గల సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు అందజేశారు. కళింగపట్నం ఓడరేవుకు ప్రస్తుతం (జూలై 2011)300 ఎకరాల భూములు ఉన్నాయి.
రోడ్డు మార్గము : విశాకపట్నం కి 150 కి.మీ. దూరము , శ్రీకాకుళం పట్నానికి 27 కీ.మీ.దూరములో ఉన్నది . అందుబాటులో ఆమదాలవలస రైల్వే స్టేషన్‌ ఉన్నది .

  • ===================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.