Tuesday, September 6, 2011

projects in Srikakulam , ప్రోజెక్టులు శ్రీకాకులం లో



శ్రీకాకులం లో -వంశధార

వంశధార స్టేజ్‌-2, ఫేజ్‌-2
జిల్లాలో అత్యధిక శాతం సాగు అవసరాలను తీరుస్తున్నది వంశధార ప్రాజెక్టు. వంశధార నదిపై గొట్టా బ్యారేజీ ఉంది. ఈ బ్యారేజీకి కుడి, ఎడమన రెండు కాల్వలున్నాయి.
కుడి కాల్వ మొత్తం పొడవు 56 కిలోమీటర్లు. హిరమండలం, ఎల్‌.ఎన్‌.పేట, సరుబుజ్జిలి, బూర్జ, ఆమదాలవలస, గార, శ్రీకాకుళం, మండలాల్లోని 62 వేల ఎకరాలకు ఈ కాల్వ ద్వారా సాగునీరందుతోంది.
ఎడమ కాల్వ పొడవు 107 కిలోమీటర్లు. ఈ కాల్వ ద్వారా జిల్లాలోని నరసన్నపేట, టెక్కలి, జలుమూరు, పలాస తదితర 13 మండలాలకు సంబంధించి 1,48,000 ఎకరాల ఆయకట్టు ఉంది.

గొట్టాబ్యారేజీ నీటి లెవల్‌ సాధారణ సామర్థ్యం 34 అడుగులు. గరిష్ఠ సామర్థ్యం 38 అడుగులు.
వంశధార నది పొడవు: 265 కిలోమీటర్లు
జిల్లాలో ప్రవహించే నది పొడవు: 85 కిలోమీటర్లు
వంశధార కాల్వ నిర్మాణం: 1971
ఎడమ కాల్వ ఆయకట్టు: 1,48,230 ఎకరాలు
కుడి కాలువ ఆయకట్టు: 62,280 ఎకరాలు
ఎడమ కాల్వ పొడవు: 104.826 కిలోమీటర్లు
కుడికాల్వ పొడవు: 55 కిలోమీటర్లు
వంశధారపై నీటిసంఘాలు: 54
డిస్ట్రిబ్యూటరీ కమిటీలు: ఎడమ కాల్వ 7, కుడికాల్వపై 1
వంశధార ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్‌ : రాడ మోహనరావు
వంశధార ఎస్‌.ఇ.: రాంబాబు
డివిజన్లు: మెంటినెన్స్‌ డివిజన్‌ నరసన్నపేట, టెక్కలి
ఎడమ కాల్వ దిగువన చెరువులు: 1036
కుడికాల్వ దిగువన చెరువులు: 1518
ఎడమ కాల్వపైపై నిర్మాణాలు: 87
కుడి కాల్వపై నిర్మాణాలు: 53

హిరమండలం గొట్టబ్యారెజ్‌
  • --
జలయజ్ఞంలో భాగంగా వంశధార స్టేజ్‌, ఫేజ్‌-2 ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2.55 లక్షల ఎకరాలకు సాగునీరు స్థిరీకరణ కోసం రూ. 933 కోట్ల అంచనా వ్యయంతో 19 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 2005 ఏప్రిల్‌ నెలలో ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అప్పటి ఒప్పందం ప్రకారం 2008 మార్చి నాటికి పనులు పూర్తి కావాల్సి ఉంది. ఆ గడువులోగా పనులు పూర్తి కాలేదు. 2009 ఏప్రిల్‌కు మరో గడువు పొడిగించారు. అయినా అప్పటికీ పూర్తి కాలేదు. 2012 మార్చి నాటికి గడువు పొడిగించారు. ఇప్పటివరకు 60 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. నిధుల కొరత, ఒడిశా ప్రభుత్వం అభ్యంతరాలు, సుప్రీంకోర్టు స్టే విధించడం తదితర కారణాల వల్ల 87, 88 ప్యాకేజీల అమలు, కొత్తూరు, భామిని మండలాల్లోని సింగిడి, పారాపురం బ్యాలెన్సింగ్‌ మినీ రిజర్వాయర్ల నిర్మాణం, కాట్రగడ వద్ద వంశధారలో అడ్డుగోడ నిర్మించి నీటిని అంధ్రావైపు మళ్లించే పనులు, వరద కాలువ పనులు నిలిచిపోయాయి.
ట్రైబ్యునల్‌లో వివాదం పరిష్కారం కానిదే ఈ ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. ప్రభుత్వం తాజాగా 2015 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు గడువు విధించింది. ఆ గడువు లోగా పనులు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు.

తోటపల్లి ప్రాజెక్టు
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల రైతాంగ ఆశాజ్యోతి 'తోటపల్లి' ప్రాజెక్టు నిర్మాణ దశలో ఉంది. ఇది పూర్తయితే ఇప్పటికే పాత బ్యారేజీ కింద ఉన్న 60 వేల ఎకరాల భూములు స్థిరీకరణతో పాటు రెండు జిల్లాల పరిధిలోని 1.20 లక్షల ఎకరాల భూములకు సాగు నీరు అందుతుంది.
1978 డిసెంబరు 15వ తేదీన ఒరిస్సాలోని భువనేశ్వర్‌లో ఆంధ్రప్రదేశ్‌, ఒరిస్సా ముఖ్యమంత్రుల మధ్య కుదిరిన అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం ప్రాజెక్టు నిర్మాణానికి బీజం పడింది. సుమారు 16 టీఎంసీల నాగావళి నదీజలాలను ఆంధ్రప్రదేశ్‌లో వినియోగించుకునేందుకు ప్రతిపాదన అంగీకారమైంది. ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న ప్రాజెక్టుకు సమీపంలో 1807లో బ్రిటిష్‌ పాలకులు నిర్మించిన బ్యారేజీ జీవితకాలం ముగియడంతో ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఇందులో భాగంగా ప్రారంభమైన ప్రక్రియలో భాగంగా అన్ని అనుమతులు పొందిన తరువాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2003,
నవంబరు 8న విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి గ్రామం వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం జలయజ్ఞంలో భాగంగా ఫాస్ట్‌ట్రాక్‌ కింద ఈ ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టారు. ఇంజినీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌కన్‌స్ట్రక్షన్‌ డివిజన్‌ (ఇ.పి.సి.) 1, 2
విభాగాలుగా విభజించి నిర్మాణం పనులు ప్రారంభించారు.
ఆఫ్‌షోర్‌ జలాశయం
పలాస నియోజకవర్గం పరిధిలోని పలాస, వజ్రపుకొత్తూరు మండలాలకు సాగునీరు అందించేందుకు 2008 ఏప్రిల్‌లో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి పలాస మండలం రేగులపాడు వద్ద ఆఫ్‌షోర్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మెళియాపుట్టి మండలం చాపర నుంచి మహేంద్రతనయ నది గుండా వెళ్లే వరద నీటిని మళ్లించి జాడుపల్లి, చీపురుపల్లి గుండా రేగులపాడు వద్ద ఏర్పాటు చేసిన రిజర్వాయర్‌లో నిల్వ చేయాల్సి ఉంది. పలాస, వజ్రపుకొత్తూరుతో పాటు మెళియాపుట్టి, నందిగాం, టెక్కలి మండలాల పరిధిలోని సుమారు 24,600 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. అంచనా వ్యయం రూ. 127 కోట్లకుగాను రూ. 123 కోట్లకు టెండరు ఖరారైంది. పనులకు శంకుస్థాపన చేసి మూడేళ్లు గడచినా ఇంత వరకు 15 శాతానికి మించి పనులు పూర్తికాలేదు. రేగులపాడు వద్ద ట్రెంచి పనులు మాత్రమే జరుగుతున్నాయి. మరో వైపు భూ సేకరణ నత్తనడకన చేపడుతున్నారు. సుమారు రూ. 15 కోట్ల విలువైన పనులు జరిగాయి. ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ నుంచి పలాస - కాశీబుగ్గ పురపాలక సంఘానికి శాశ్వత తాగునీటి పథకం ఏర్పాటుకు యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. వాస్తవానికి 2010 మార్చి నాటికి ఆఫ్‌షోర్‌ ప్రొజెక్టు పనులు పూర్తి చేయాల్సి ఉంది. పనులు జరగనందున మరో రెండేళ్ల కాల వ్యవధిలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గడువు
ఇచ్చింది. దీనిని 2012లో మార్చి నాటికి పూర్తి చేయాల్సి ఉన్నా ఆ దిశగా పనులు జరగడం లేదు. దీంతో ఆఫ్‌షోర్‌ సాగునీటి సరఫరా ఈ ప్రాంత ప్రజానీకానికి కలగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది.
జలయజ్ఞం ప్రాజెక్టులో భాగంగా మహేంద్రతనయ నదిపై ఆఫ్‌షోర్‌ జలాశయం పనులు చేపట్టేందుకు అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి 2008 ఏప్రిల్‌ 4న పలాస మండలం రేగులపాడు వద్ద శంకుస్థాపన చేశారు. రూ. 127 కోట్ల అంచనాలతో మెళియాపుట్టి, టెక్కలి, పలాస, నందిగాం మండలాల్లోని 24600 ఎకరాలకు సాగునీరు అందించాలన్న ఉద్దేశ్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు.
భూసేకరణ ముందుకు సాగకపోవడం, నిధుల కొరత వెరసి పనులు నత్తనడకన సాగుతున్నాయి. మెళియాపుట్టి మండలం చాపరలో మహేంద్రతనయ నుంచి పలాస మండలం రేగులపాడు వరకు 13.54 కిలోమీటర్ల పొడవునా వరద కాలువ ద్వారా జలాశయానికి నీరు తరలించాల్సి ఉంది. ఇందుకు 2600 ఎకరాల భూసేకరణ అవసరం. ప్రభుత్వం ఇప్పటివరకు 600 ఎకరాలు మాత్రమే సేకరించగలిగింది.
గత మూడేళ్లుగా బడ్జెట్లో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం రూ. 98 కోట్లు మాత్రమే కేటాయించింది. సేకరణ ముందుకు సాగకపోవడంతో వెనుకకు మళ్లిపోయాయి.
నాగావళి నదిపై విజయనగరం జిల్లాలో ఉన్న తోటపల్లి ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం రెండు కాల్వల ద్వారా జిల్లాలోని వ్యవసాయ భూములకు సాగునీరందుతోంది. వీరఘట్టం, పాలకొండ మండలాల పరిధిలో కుడి కాల్వ 24 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. వంగర మండలం పరిధిలో ఎడమ కాల్వ 5 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ రెండు కాల్వల ద్వారా శ్రీకాకుళం జిల్లాలో 40 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందుతోంది.
సువర్ణముఖి నదిపై మడ్డువలస ప్రాజెక్టు ఉంది. దీనికి రెండు కాలువలు ఉన్నాయి. వీటి ద్వారా 24,700 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందుతోంది. కుడి కాల్వ రాజాం, వంగర, రేగిడి, సంతకవిటి, జి.సిగడాం మండలాల పరిధిలో మొత్తం 50 కిలోమీటర్ల పొడవున ఉంది. ఎడమ కాల్వ వంగర మండలం పరిధిలో 5 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది.

మడ్డువలస ప్రాజెక్టు : మడ్డువలస ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 3.3 టీఎంసీలు.

* శ్రీకాకుళం జిల్లా వంగర మండలం మడ్డువలస వద్ద సువర్ణముఖి నదిపై రూ. 132 కోట్ల అంచనా వ్యయంతో మడ్డువలస ప్రాజెక్టును నిర్మించారు. సువర్ణముఖి, వేగవతి నదుల ప్రవాహం ఇందులో చేరేలా రూపకల్పన చేశారు. 2002 నవంబరు 30వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దీన్ని జాతికి అంకింత చేశారు
* ప్రస్తుతం ఇది మధ్యతరహా ప్రాజెక్టుగా ఉంది. రెండో దశ విస్తరణ పూర్తయితే జలాశయం స్థాయి పెరుగుతుంది
* జలాశయం పూర్తి స్థాయి నీటి సామర్ధ్యం 65 మీటర్లు. రిజర్వాయరులో నీటి సామర్థ్యం పెరిగితే కింద నున్న నాగావళి నదిలోకి నీటిని విడిచిపెట్టేందుకు రిజర్వాయరుకు మొత్తం 11 గేట్లు అమర్చారు
* రిజర్వాయరు ద్వారా వంగర, రేగిడి ఆమదాలవలస, సంతకవిటి, సి.సిగడాం, పొందూరు మండలాల్లోని 104 గ్రామాల పరిధిలో 24,700 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందిస్తున్నారు. 50 కిలోమీటర్ల పొడవున్న కుడికాలువ ద్వారా 23,750 ఎకరాలు, 1.6 కిలోమీటర్ల పొడవున్న ఎడమ కాల్వ ద్వారా 950 ఎకకాల
ఆయకట్టుకు అధికారికంగా సాగునీరందుతోంది.
* మడ్డువలస రెండో దశ విస్తరణ పనులకు ప్రభుత్వం రూ. 47 కోట్లతో టెండర్లు ఖరారు చేసింది. ఈ పనులు పూర్తయితే జి.సిగడాం, లావేరు, పొందూరు మండలాల పరిధిలోని 12,453 ఎకరాల ఆయకట్టుకు అదనంగా సాగునీరు అందుతుంది
* ప్రాజెక్టులోకి సరాసరి నీటిమట్టం 16 టి.ఎం.సి.లు. ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం 3.2 టి.ఎం.సి.లు.
జంపరకోట రిజర్వాయర్‌ పాలకొండ మండలంలోని జంపరకోట వద్ద పెద్దగెడ్డపై రిజర్వాయరు నిర్మాణానికి 1983లో శ్రీకారం చుట్టారు. రూ. 2 కోట్ల వ్యయంతో 2100 ఎకరాలకు సాగు నీరందించాలని నిర్ణయించారు. కొండల నుంచి వచ్చిన వూటజలాలలను రిజర్వాయరులోకి చేర్చి వినియోగించాలన్నది ఉద్దేశం. ఏడాదిపాటు పనులు సాగి నిలిచిపోయాయి. అప్పటి నుంచి రైతులు పోరాటాలు చేస్తూనే వచ్చారు. 2007లో మరోమారు ఈ రిజర్వాయర్‌ నిర్మాణం తెరపైకి వచ్చింది. కొత్త అంచనాలు రూపొందించి రూ. 16 కోట్లుగా నిర్ణయించారు.ఏడాదిలోగా రిజర్వాయర్‌ పూర్తి చేసి 14 గ్రామాల రైతులకు సాగునీరందించాలని ప్రతిపాదించారు. పనులు ప్రారంభమై ఆర్నెళ్లకే నిలిచిపోయాయి. మట్టికట్ట నిర్మాణం పూర్తికాలేదు. ఇంతవరకు కాల్వల ఏర్పాటు జరగలేదు. పొర్లుకట్టల నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయింది. నిధులు మాత్రం ఇప్పటికే రూ. 9 కోట్లు ఖర్చు చూపారు. కొండలోవగెడ్డ రిజర్వాయర్‌ భామిని మండలంలోని యాతంగూడ వద్ద మినీ రిజర్వాయరు నిర్మాణానికి 1996లో ప్రతిపాదించారు. రూ. 3 కోట్లతో ఎనిమిది గ్రామాల పరిధిలోని వెయ్యి ఎకరాలకు సాగునీరందించాలని ప్రతిపాదించారు. పనులు ప్రారంభదశలోనే నిలిచిపోయాయి. మట్టికట్ట సగం వరకు ప్రారంభించి పనులు ఆపేశారు. మొదటి నుంచి నిధులు కేటాయింపులు లేకపోవడంతో పనులు జరగడం లేదు.

అక్కులుపేట ఎత్తిపోతల పథకం :

ఆమదాలవలస మండలం అక్కులుపేట వద్ద రూ. 6.24 కోట్ల వ్యయంతో నాలుగేళ్ల క్రితం ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆమదాలవలస, బూర్జ మండలాల పరిధిలో మండాది, అక్కులుపేట, పార్వతీశంపేట, బొబ్బిలిపేట, తాళ్లవలస, తిమ్మాపురం, ముళ్లశాస్త్రులపేట, జగ్గు శాస్త్రులపేట,

సంతకొత్తవలస, చింతలపేట, జి.కె.రంగరాయిపురం, కాలపర్తి, సలికాం, సిలగాం, తాళ్లభ, ఎస్‌.కె.పేట మొత్తం 16 గ్రామాలకు సంబంధించిన 4 వేల 311 ఎకరాలకు సాగు నీరందించాలన్నది అధికారుల ప్రయత్నం. ఈ పథకం నిర్మాణానికి 2007 జూన్‌ 14న స్థానిక ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి శంకుస్థాపన చేశారు. పనులు ప్రారంభించి నాలుగేళ్లు గడిచినా ఇంతవరకు పూర్తి కాలేదు.


  • =======================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !