ఘంటసాల సంగీత కళాశాల ప్రారంభం
ఘంటసాల అమరజీవి, కలియుగం ఉన్నన్నాళ్లు ఆయన స్వరం వినిపిస్తుందని సినీ నటుడు కళ్లు చిదంబరం పేర్కొన్నారు. రాజాం పట్టణంలోని సారథి రోడ్డులో ఘంటసాల సంగీత కళాశాలను ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన ఘంటసాల సంగీత విభావరికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఘంటసాల పాటలు వింటే తేనె జారుతున్నట్లు, పనసతొనలు నములుతున్నట్లు ఉంటుందన్నారు. మిధునం నిర్మాత మొయిద ఆనందరావును చిదంబరం అభినందించారు. డబ్బుల కోసం కాకుండా, సమాజం కోసం సినిమా తీసి నిజమైన హీరో అనిపించుకున్నారని కొనియాడారు.
రత్నకుమార్ సందేశం
ఘంటసాల కళాశాల ఏర్పాటు, సంగీత విభావరి నిర్వహణపై ఘంటసాల కుమారుడు రత్నకుమార్ హర్షం వ్యక్తం చేశారు. నిర్మాత ఆనందరావు ఫోనులో రత్నకుమార్ సభికులకు సందేశం వినిపించారు. తన తండ్రి చనిపోయి 39 సంవత్సరాలు దాటిందని, ఆయన అభిమానులంతా ఆయన పాటలను ఇప్పటి తరానికి చేరువ చేసేందుకు కృషి చేస్తున్నారని అభినందించారు. ప్రముఖ రంగస్థల నటుడు గులివిందల ఆదినారాయణ, వ్యాపారవేత్త కామేశ్వరరావు, వావిలపల్లి రామ్మూర్తినాయుడు, ఎం.ప్రసాదరావు, ఎం.సుందరరావు మాస్టారు, ఎస్.పైడిరాజు, రామినాయుడు, పిల్లా తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.
- =====================
